దాదాపు ఏడాది తర్వాత మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. ఫిబ్రవరి 13, 2025 నుండి మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత, 60 మంది సభ్యుల శాసనసభను తాత్కాలికంగా నిలిపివేశారు. అసెంబ్లీ పదవీకాలం 2027లో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా నియమితులైన బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ ఎన్డీయే బృందంతో కలిసి రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో సమావేశమయ్యారు. ఏన్డీయే ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేకుందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు ఎన్డీయే తీర్మాన కాపీని అందజేశారు.
మంగళవారం (ఫిబ్రవరి 3, 2026) బిజెపికి చెందిన 37 మంది ఎమ్మెల్యేలలో 35 మంది శాసనసభ్యులు, పార్టీ కేంద్ర పరిశీలకుడు తరుణ్ చుగ్, ఈశాన్య ఇన్ఛార్జ్ సంబిత్ పాత్రా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎ. శారదా దేవి సమక్షంలో వై. ఖేమ్చంద్ సింగ్ శాసనసభా పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యారు. ఖేమ్చంద్ సింగ్ బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.
మణిపూర్లో ప్రస్తుతం బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 32 మంది బీజేపీ అభ్యర్థులు గెలిచారు. జేడీయూ ఆరు సీట్లు గెలుచుకుంది. వారిలో ఐదుగురు సభ్యులు తరువాత బీజేపీలో చేరారు. మిగిలిన ఎమ్మెల్యేలు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) నుండి ఆరుగురు, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) నుండి ఐదుగురు, కాంగ్రెస్ నుండి ఐదుగురు, కుకి పీపుల్స్ అలయన్స్ నుండి ఇద్దరు, జేడీయూ నుండి ఒకరు, ముగ్గురు స్వతంత్ర శాసనసనభ్యులు ఉన్నారు.
గత కొన్ని నెలలుగా, బీజేపీ కేంద్ర నాయకత్వం దాని మెయిటీ – కుకి ఎమ్మెల్యేలు, మిత్రపక్షాలు NPF , NPP సహా కొంతమంది స్వతంత్ర ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో రాజకీయ పరిస్థితి అనుకూలంగా ఉందో లేదో అంచనా వేయడానికి అనేక రౌండ్ల సమావేశాలు నిర్వహించారు. ఫిబ్రవరి 9, 2025న ముఖ్యమంత్రి పదవికి ఎన్. బిరెన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. మెయిటీ – కుకి వర్గాల మధ్య నెలల తరబడి జాతి హింస మధ్య ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.
మాజీ తైక్వాండో అథ్లెట్ అయిన ఖేమ్చంద్ సింగ్ 2017 – 2022లో సింగ్జమేయ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా మణిపూర్ శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో ఆయన 2017 నుండి 2022 వరకు మణిపూర్ శాసనసభ స్పీకర్గా కూడా పనిచేశారు. 2022లో బిరేన్ సింగ్ రెండవ ప్రభుత్వంలో ఆయన కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..