నెత్తిలో పేన్లు పెరిగిపోవడం కారణంగా ఇన్పెక్షన్ అయి ఓ 12 ఏళ్ల బాలిక మరణించిన ఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పూరిలోని చంపాగ్రా ప్రాంతానికి చెందిన ఆరో తరగతి విద్యార్థిని లక్ష్మీప్రియ గత కొన్ని రోజులుగా తల పేనుల కారణంగా బాధపడుతోంది. మొదట ఇది అందరికి ఉండే సాధారణ సమస్యే అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ బాలిక విపరీతమైన దురదతో బాధపడడంతో.. పేన్లను తొలగించేందుకు వేపకు రసం నుంచి మార్కెట్లో దొరికే ఉత్పత్తుల వరకు అన్నింటిని వాడారు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది.
దీంతో ఈ సమస్య నుండి బయటపడటానికి అమ్మాయి తల్లి తల గుండు చేయించుకోవాలని బాలికకు చెప్పగా అందుకు బాలిక అంగీకరించలేదు. దీంతో సమస్య మరింత పెరగడం ప్రారంభమైంది. ఒకానొక సమయంలో, ఆమె తల నుండి దుర్వాసన రావడం ప్రారంభమైంది. దీంతో బాలిక ఇంట్లో నుంచి బయటకు రావడం మానేసింది. ఇంతలోనే బాలిక పరిస్థితి మరింత విషమించింది. ఆమె రక్తాన్ని వాంతులు చేసుకోవడం స్టార్ట్ చేసింది. దీంతో బయపడిపోయిన కుటుంబ సభ్యులు బాలికను పూరి మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు ఆమెకు వైద్యం అందించారు. కానీ చికిత్స పొందుతూనే బాలిక మరణించింది. అయితే తల పేను కారణంగా అమ్మాయి తలపై తీవ్ర ఇన్ఫెక్షన్ సోకిందని.. సెప్టిసిమియా కారణంగా బాలిక మరణించిందని తెలిపారు.
కోల్కతాకు చెందిన చర్మవ్యాధి నిపుణుడు ఎం. పాల్ మాట్లాడుతూ పేనులు తల నుండి రక్తాన్ని పీలుస్తాయని.. అందుకే దురద మొదలవుతుందన్నారు. గోళ్ళతో గోకడం వల్ల తలపై గాయాలు ఏర్పడటం ప్రారంభమవుతుందని.. ఆ గాయాలు ఎక్కువైతే ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుందన్నారు. ఈ ఇన్ఫెక్షన్ కారణంగానే సెప్టిసిమియా అనే వ్యాధి వస్తుందన్నారు. ఈ సందర్భంలో, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రక్త విషానికి కారణమవుతుంది. దీని కారణంగా, శరీర అవయవాలు క్రమంగా పనిచేయడం మానేస్తాయన్నారు. చివరకు మరణం కూడా సంభవించవచ్చన్నారు.
పేన్ల పట్ల జాగ్రత్త అవసరం
మీ పిల్లల తలలో పేనులు ఉంటే వాటిని వదిలించుకోవడానికి, ముందుగా పిల్లల పరిశుభ్రతను పర్యవేక్షించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. పిల్లల బట్టలు, బెడ్ షీట్లు, దిండు కవర్లు, దువ్వెనలు, తువ్వాళ్లను వేడి నీటిలో క్రమం తప్పకుండా ఉతకడం, కడగడం చేయాలన్నారు. పిల్లల ఆడుకునే బొమ్మలను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని. ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. పెంపుడు జంతువులు కూడా పేలను వ్యాప్తి చేస్తాయని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.