చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు పళ్ళు వచ్చాక.. అంటే ఒక సంవత్సరం దాటాకే బ్రష్ చేయించడం మొదలుపెడతారు. కానీ పిల్లల డాక్టర్ కారుణ్య సలహా ప్రకారం ఇది తప్పు. శిశువులకు పళ్ళ సంరక్షణ చిన్న వయసు నుంచే మొదలుపెట్టాలి. ఎందుకంటే పాల పళ్ళు గట్టిగా, అందంగా ఉంటేనే భవిష్యత్తులో శాశ్వత పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
ఎప్పుడు మొదలుపెట్టాలి..?
శిశువుకు మొదటి పళ్ళు కనిపించిన వెంటనే దంత శుభ్రత మొదలుపెట్టాలి. సాధారణంగా ఇది 6 నెలల వయసులో జరుగుతుంది. పళ్ళు వచ్చిన వెంటనే బ్రష్ చేయించడం అలవాటు చేయాలి.
ఎలా చేయాలి..?
- శిశువులకు (0-1 సంవత్సరం): ఫింగర్ బ్రష్ ను వాడాలి. ఇది తల్లిదండ్రులు తమ వేలికి పెట్టుకొని.. పళ్ళను, చిగుళ్ళను మెల్లగా తుడవడానికి ఉపయోగపడుతుంది. ఇది పళ్ళ మీద ఉండే పాల మిగులును తొలగించి చిగుళ్లకు మసాజ్ చేస్తుంది.
- టాడ్లర్స్ (toddlers)కు (1-3 సంవత్సరాలు): చిన్న తల భాగం, పెద్ద హ్యాండిల్ ఉన్న టూత్ బ్రష్ వాడాలి. ఈ బ్రష్ను పిల్లలు సులభంగా పట్టుకొని ఉపయోగించుకోవచ్చు.
ముఖ్యమైన విషయాలు
- టూత్పేస్ట్ చాలా తక్కువగా (బియ్యం గింజంత) వాడాలి.
- పిల్లలు పేస్ట్ మింగకుండా చూసుకోవాలి.
- రోజుకు కనీసం రెండు సార్లు, ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయించాలి.
- స్వీట్స్, చాక్లెట్స్, షుగర్ ఉన్న డ్రింక్స్ తగ్గించడం మంచిది.
చిన్న వయసులోనే ఈ అలవాటు నేర్పిస్తే.. భవిష్యత్తులో దంత సమస్యలు రాకుండా ఉంటాయి. పిల్లల చక్కటి చిరునవ్వు కోసం ఈ జాగ్రత్తలు ఇప్పుడే మొదలుపెట్టండి.