సాధారణంగా మనం పాత ఉపయోగించని వస్తువులను పారేస్తాము లేదా స్క్రాప్ డీలర్లకు ఇచ్చేస్తాము. కానీ, పాత సిమ్ కార్డులను ఉపయోగించి బంగారాన్ని వెలికితీస్తారని మీకు తెలుసా..? అవును, ఇక్కడ ఒక వ్యక్తి పడవేసిన పాత సిమ్ కార్డుల నుండి రూ.27 లక్షల విలువైన బంగారాన్ని వెలికితీశాడు. ఇటీవల, అతను 2 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, సిమ్ కార్డులను రసాయనికంగా శుద్ధి చేసి, దాని నుండి 191 గ్రాముల బంగారాన్నిసేకరించిననట్టుగా చెబుతున్నారు. దీని విలువ మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 28 లక్షలు ఉంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతన్ని ఆల్కెమిస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చైనాలో ఒక వ్యక్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. సోషల్ మీడియాలో క్వియావో అని పిలువబడే ఈ వ్యక్తి చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని హుయిజౌ నగరంలో నివసిస్తున్నాడు. అతను పాత ఎలక్ట్రానిక్ పరికరాల నుండి విలువైన లోహాలను వేరు చేస్తాడు. అతని వీడియోలలో ఒకటి సోషల్ మీడియాలో 5 మిలియన్లకు పైగా చూశారు. వీడియోలో అతను పాత సిమ్ కార్డులు, చిప్లను రసాయనాలతో నిండిన డ్రమ్లో ఉంచి, ఆపై తుప్పు, రసాయన ప్రతిచర్యలు, వేడి చేయడం వంటి ప్రక్రియల ద్వారా బంగారాన్ని వేరు చేస్తున్నట్లు చూడవచ్చు.
సిమ్ కార్డులలో బంగారం ఎందుకు ఉంటుంది?
క్వియావో ప్రకారం, సిమ్ కార్డుల కొన్ని కీలక భాగాలు బంగారంతో పూత పూయబడి ఉంటాయి. తద్వారా అవి ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటాయి. తుప్పు పట్టకుండా ఉంటుంది. ఒక సిమ్ కార్డు సాధారణంగా 0.001 గ్రాముల కంటే తక్కువ బంగారం కలిగి ఉంటుందని ఆయన అన్నారు. సాధారణ సిమ్ కార్డులో బంగారం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించడం వల్ల అధిక మొత్తంలో లభిస్తుంది. కేవలం నాలుగు, ఐదు సిమ్ కార్డులతో బంగారం దొరకదు. సుమారు రెండు టన్నుల ఎలక్ట్రానిక్ స్క్రాప్ను ప్రాసెస్ చేయడం ద్వారా తాను ఈ బంగారాన్ని వెలికితీశానని, ఇందులో సిమ్ కార్డులు మాత్రమే కాకుండా టెలికాం పరిశ్రమలో ఉపయోగించే ఇతర చిప్లు కూడా ఉన్నాయని ఆయన వివరించారు.
సోషల్ మీడియాలో ఇప్పుడు అతను ఎంతగానో పాపులర్ అయ్యాడు. నెటి జన్లు అతన్ని ఎంతగానో ప్రశంసిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు కంప్యూటర్ చిప్స్, పాత ఎలక్ట్రానిక్స్ను పారేసేవారని, కానీ ఇప్పుడు చింతిస్తున్నామని కూడా రాశారు. అయితే, ప్రజలకు ఈ పని నేర్పించడం తన ఉద్దేశ్యం కాదని కియావో స్పష్టం చేశారు. సరైన శిక్షణ, అనుమతి లేకుండా అలా చేయడం ప్రమాదకరం, చట్టవిరుద్ధం కూడా కావచ్చని ఆయన హెచ్చరించాడు. ఈ ప్రక్రియలో వాడే అక్వా రెజియా అనే రసాయనం అత్యంత ప్రమాదకరమైనది. ఇది నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ల మిశ్రమం. దీని నుండి వెలువడే విష వాయువులు ప్రాణాపాయానికి దారితీస్తాయని క్యో హెచ్చరించాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..