అఫ్గానిస్థాన్లో మహిళల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇప్పటికే విద్య, ఉపాధి వంటి ప్రాథమిక హక్కులను కోల్పోయిన అఫ్గాన్ మహిళలపై తాలిబన్లు మరో అమానవీయ చట్టాన్ని ప్రయోగించారు. ఇంట్లో మగవారు మహిళలను, పిల్లలను శారీరకంగా హింసించినా అది నేరం కాదంటూ కొత్త శిక్షాస్మృతిని తీసుకొచ్చారు. ఇంట్లో పురుషులు మహిళలను లేదా పిల్లలను కొట్టినప్పుడు రక్తం కారనంత వరకు లేదా ఎముకలు విరగనంత వరకు దానిని నేరంగా చూడరు. అంటే భార్యను భర్త శారీరకంగా హింసించే హక్కును ఈ చట్టం కల్పిస్తోంది. ఒకవేళ భర్త క్రూరత్వానికి పాల్పడి ఎముకలు విరిగితే.. బాధితురాలు ఆ విషయాన్ని కోర్టులో నిరూపించగలిగితేనే సదరు పురుషుడికి జైలు శిక్ష విధిస్తారు. అది కూడా కేవలం 15 రోజులే కావడం గమనార్హం. అయితే న్యాయం కోసం కోర్టుకు వెళ్లడం కూడా బాధితురాలికి అగ్నిపరీక్షే. మహిళ కోర్టుకు వెళ్లాలంటే ఆమె వెంట తప్పనిసరిగా తండ్రి లేదా కుమారుడు తోడుగా రావాలి. పైగా న్యాయమూర్తికి గాయాలను చూపించేటప్పుడు కూడా ఆమె శరీరం పూర్తిగా కప్పి ఉంచాలనే వింత నిబంధనను విధించారు. మరికొన్ని నిబంధనలను ఈ కోడ్లో చేర్చారు. వివాహిత తన భర్త అనుమతి లేకుండా బంధువుల ఇంటికి వెళ్తే ఆమెకు మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. గతంలో 2009లో ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వం మహిళలపై హింసను నిరోధించేందుకు తెచ్చిన చట్టాలను ఈ కొత్త పీనల్ కోడ్ పూర్తిగా రద్దు చేసింది. కొత్త శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 9 ప్రకారం.. అఫ్గాన్ సమాజాన్ని తాలిబన్లు నాలుగు విభాగాలుగా వర్గీకరించారు. అందులో మొదటిది మత పెద్దలు ఉల్మా, రెండోది ఉన్నత వర్గం అష్రాఫ్, మూడోది మధ్య తరగతి, నాలుగోది దిగువ తరగతి. ఈ వర్గీకరణ ప్రకారం.. నేర తీవ్రతను బట్టి కాకుండా ఆ వ్యక్తి ఏ వర్గానికి చెందినవాడు అనే దానిపై ఆధారపడి శిక్షలు ఉండనున్నాయి. తాలిబన్ల ఈ అరాచక నిర్ణయాలపై ఐక్యరాజ్యసమితి, మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మహిళలపై జరుగుతున్న ఈ అణచివేతను అడ్డుకోవాలని, అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకోవాలని హక్కుల నేతలు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాబోయ్.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్..
ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా
మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే
Varanasi: ఆ ఒక్క ఎపిసోడ్కే రూ.300 కోట్లు.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్న జక్కన్న