ఫ్రెండ్షిప్ రోజున మహారాష్ట్రలో జరిగిన ఒక షాకింగ్ ఘటన బయటకు వచ్చింది. బెంచ్ మీద కూర్చోవడం విషయంలో జరిగిన చిన్న వివాదం కారణంగా 10వ తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతని స్నేహితులు హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. సత్పూర్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ మొత్తం సంఘటన ఒక ప్రైవేట్ క్లాస్ ప్రాంగణంలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఒక ప్రైవేట్ ట్యూషన్ క్లాస్లో బెంచ్ మీద కూర్చోవడంపై జరిగిన వివాదంలో ఒక విద్యార్థి అత్యంత దారుణంగా హతమయ్యాడు. నాసిక్లోని సత్పూర్ ప్రాంతంలో జరిగిన ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన సమాజాన్ని కుదిపేసింది. సత్పూర్ ప్రాంతంలోని జ్ఞాన్ గంగా ట్యూషన్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థి యశ్రాజ్ గంగుర్డే హత్యకు గురయ్యాడు. మృతుడు యశ్రాజ్ బుధవారం(జూలై 30) తనతో పాటు చదువుకుంటున్న ఇద్దరు మైనర్లతో బెంచ్ మీద కూర్చోవడంపై వాగ్వాదానికి దిగాడు. అప్పటి నుండి, నిందితులు అతన్ని వేధిస్తూ, దుర్భాషలాడుతున్నారు.
అశోక్నగర్కు చెందిన యశ్రాజ్ తుకారాం గంగుర్డే ఆగస్టు 2న యథావిధిగా అదే ప్రాంతంలోని రాష్ట్ర ఉద్యోగుల కాలనీలోని జ్ఞాన్ గంగా క్లాసెస్ ప్రైవేట్ ట్యూషన్ కోసం వెళ్లాడు. అయితే ఆ తర్వాత, సాయంత్రం 6.15 గంటల ప్రాంతంలో హీర్ గార్డెన్లో అపస్మారక స్థితిలో కనిపించాడు. రిక్షా పుల్లర్ నవనాథ్ అవ్చార్ వెంటనే అతన్ని చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు.
క్లాస్లో జరిగిన వివాదం కారణంగా, యశ్రాజ్ తోపాటు చదువుకుంటున్న అతని ఇద్దరు స్నేహితులు తీవ్రంగా కొట్టారు. చెంపదెబ్బలు, కాళ్లత తన్నడంతో యశ్రాజ్ గంగుర్డే తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారకస్థితిలో ఉన్న బాలుడిని రిక్షా పుల్లర్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించాడు. కానీ చికిత్సకు ముందే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ హత్య కేసులో ఇద్దరు పిల్లలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారిద్దరిపై నాసిక్లోని సత్పూర్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లలను విచారిస్తున్నారు. కానీ ఈ సంఘటన చిన్నపిల్లలు, టీనేజర్లలో పెరుగుతున్న నేర ధోరణుల గురించి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..