అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. ప్రధాన రహదారిపై ఉన్న ఓ జ్యువెలరీ షాపులో చొరబడి భారీగా వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బళ్లారి రోడ్డులో ఉన్న ‘సయ్యద్ జ్యువెలర్స్’ దుకాణమే లక్ష్యంగా దుండగులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో షాపులోకి చొరబడిన దొంగలు, అందులో ఉన్న సుమారు 6 లక్షల రూపాయల విలువైన వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. అయితే, షాపులోని బంగారు ఆభరణాలన్నీ భద్రంగా ట్రెజరీ లో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. లాకర్ను పగులగొట్టలేకపోయిన దుండగులు, బయట ప్రదర్శనకు ఉన్న వెండి వస్తువులను తీసుకుని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. షాపులోని సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేయగా, దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దించి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. పట్టణ నడిబొడ్డున ఉన్న దుకాణంలోనే చోరీ జరగడంతో వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరణ్యాలు దాటి హైవేపై ప్రత్యక్షమవుతున్న పులులు, సింహాలు.. భయాందోళనలో జనం
వెబ్ యూజర్లకు శుభవార్త.. ఇక బ్రౌజర్ నుండే నేరుగా వీడియో, ఆడియో కాల్స్
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే.. ఏం చేశారంటే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగుతున్నారా.. జాగ్రత్త
కష్టపడి రాళ్లతో పగలగొట్టాడు.. అంతలోనే..