మెదక్, ఫిబ్రవరి 11: కన్న ప్రేమకు మించినది ఈ లోకంలో ఏదీ లేదు అంటారు చాలా మంది. కానీ కొందరు మాత్రం నవజాత శిశువుల పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు. కన్నవారే తమ పేగు బంధాన్ని తెంపుకుని తమ పసికందులను నిస్సహాయ స్థితిలో వదిలివేస్తున్న సంఘటనలు నిత్యం కోకొల్లలుగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా అటువంటి మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ శిశువును తల్లిదండ్రులు పెంట కుప్పలపై వదిలివేసిన హృదయవిదారక ఘటన మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం భద్రియా తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
మెదక్ జిల్లా (మం) చిలప్ చెడ్ మండలం భద్రియా తండాలో పెంట కుప్పపై అప్పుడే పుట్టిన మగ శిశువు ఏడుపును గమనించిన గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ వెంటనే స్థానికులకు సమాచారం అందించింది. స్థానికులు చూసేసరికి పెంటకుప్ప పై మగ శిశువును గుర్తించారు. చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో అంగన్వాడీ టీచర్ దుర్గకు మగ శిశువునీ అప్పజెప్పారు. ఆమె సమాచారం మేరకు ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు శిశువును మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. శిశువు ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు తెలిపారు. శిశువును ఎవరో వేరే ప్రాంతం నుంచి తీసుకువచ్చి ఇక్కడ పడేసి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.