మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. చాలామంది భక్తులు పాదయాత్రగా స్వామివారి దర్శనానికి తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం వెళ్లే నడక మార్గంలో ఓ భక్తుడికి పెను ప్రమాదం తప్పింది. నంద్యాల జిల్లా పరిధిలోని భీముని కొలను వద్ద తులసిరామ్ అనే శివ భక్తుడు అర్ధరాత్రి సమయంలో తేలు కాటుకు గురయ్యారు. విష ప్రభావంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురై, అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో తోటి భక్తులు ఆందోళన చెందారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అంత చీకటిలోనూ, అత్యంత ప్రమాదకరమైన అటవీ మార్గంలో ప్రయాణించి భీముని కొలను వద్దకు చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న భక్తుడిని భుజాలపై మోస్తూ సురక్షితంగా పైకి తీసుకువచ్చారు. అటవీ సిబ్బంది తులసిరామ్కు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, కైలాసద్వారం వద్ద సిద్ధంగా ఉన్న అంబులెన్స్లో సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి, ప్రాణాలకు తెగించి భక్తుడిని కాపాడిన అటవీ శాఖ సిబ్బందిని భక్తులు, ఉన్నతాధికారులు ప్రశంసించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bhainsa Municipality: 20 ఏళ్ల తర్వాత భైంసాలో గెలిచిన బీజేపీ
Adilabad Municipality: ఆదిలాబాద్లో కుర్చీ కోసం కలిసిపోయిన అన్ని పార్టీలు
చాక్పీస్పై సూక్ష్మ శివలింగం.. చూపరులను మంత్రముగ్ధులను చేస్తుందిగా
డ్రై క్లీనర్ మంత్లీ ఇన్కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్గా పోస్ట్!
గిన్నిస్ రికార్డు సృష్టించిన భారీ పాము: చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే